డ్రగ్స్ కేసు విచారణ: మీడియాతో మాట్లాడకుండా నేరుగా ఈడీ కార్యాలయంలోకి వెళ్లిపోయిన పూరీ జగన్నాథ్

  • టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభం
  • ఈడీ విచారణను ఎదుర్కొంటున్న తొలి సినీ ప్రముఖుడు పూరీ జగన్నాథ్
  • మధ్యాహ్నం వరకు విచారణ జరిగే అవకాశం
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈసారి ఈ కేసును ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణ చేస్తోంది. ఈరోజు నుంచి 12 మంది సినీ ప్రముఖులను విచారించనుంది. తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు.

ఈ క్రమంలో కాసేపటి క్రితం ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా... 10.05 గంటలకే ఆయన వచ్చేశారు. ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా... పూరీ జగన్నాథ్ స్పందించలేదు. కారు దిగిన వెంటనే నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. ఈడీ సిబ్బంది ఆయనను మెట్లపై నుంచి పైకి తీసుకెళ్లారు. కాసేపట్లో ఆయన విచారణ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు విచారణ కొనసాగే అవకాశం కనపడుతోంది.

విచారణ ఎలా కొనసాగనుంది, ఏయే ప్రశ్నలు అడగబోతున్నారు, పూరీ జగన్నాథ్ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అనే విషయాలు ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మరోవైపు హవాలా మార్గంలో విదేశాలకు డబ్బును తరలించి, అక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇది నిజమైతే... మనీలాండరింగ్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది.

Puri Jagannadh
Tollywood
Drugs
Enforcement Directorate

More Telugu News